విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
మైనారిటీ జూనియర్ కళాశాల సందర్శన.. సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గోదావరిఖని ఆర్ఎఫ్సీఎల్ రోడ్, శాంతినగర్లోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (రామగుండం బాయ్స్–1)ను సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి, భోజనం నాణ్యత, వసతి, విద్యా సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
“మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిర్భయంగా తెలియజేయండి. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. చదువుపై పూర్తి దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి” అని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.
తదనంతరం తరగతి గదులు, వసతి గృహాలు, భోజనశాల తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించిన రాజ్ ఠాకూర్, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.
విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
