నూతన కోర్టు భవనంతో సత్వర న్యాయానికి మరింత ఊతం…
“ప్రతి ఒక్కరినీ గౌరవిద్దాం.. సంతోషంగా జీవిద్దాం” — హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక….
సాక్షిత పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి,మందమర్రి/ : పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం నూతన భవనాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, ఇతరులను గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలని సూచించారు. అహంకారం, చిన్నచిన్న విషయాలే అనేక సందర్భాల్లో గొడవలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కేసుల పరిష్కారంలో వాయిదాల సంఖ్యను తగ్గించేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నూతన కోర్టు భవనాల ప్రారంభంతో న్యాయపరమైన సేవలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు కేసుల పరిష్కార ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
