గంజాయి నిర్మూలనపై ప్రత్యేక చర్యలు
** పోలీస్ వజ్ర పహార్ తో అవగాహన
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు, రేణిగుంట డిఎస్పీ వై.శ్రీనివాస రావు ఆదేశాల ప్రకారం, రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ సీఐ డి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో “వజ్ర ప్రహర్” కార్యక్రమం కింద ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మంగంపేట ప్రాంతంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులవారి పల్లి ఎస్సై పి. మహేష్, రైల్వే కోడూరు ఎస్సై ప్రసాద్ రెడ్డి, పుల్లంపేట ఎస్సై చిన్న రెడ్డప్పలు రైల్వే కోడూరు టౌన్, రూరల్ పోలీస్ సిబ్బంది కలిసి ఓబులవారిపల్లి మండలం పరిధిలోని మంగంపేట గ్రామం 9, 10వ వీధుల్లో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్లో ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణా, నిల్వ, వినియోగాన్ని అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, గృహాలను సమగ్రంగా తనిఖీ చేయడం జరిగింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావులేకుండా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగించారు. గంజాయి వాడకం వల్ల యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు సమాజంలో నేరాల పెరుగుదలకు దారితీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం ఇలాంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా, గంజాయి అమ్మకం, నిల్వ, వినియోగం చట్టవిరుద్ధమని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సంబంధిత సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.
అలాగే మహిళలపై నేరాలు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, దొంగతనాల నివారణపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి గంజాయి రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పోలీసులు కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY