SAKSHITHA NEWS


DEPUTY హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసమైన ప్రజాభవన్‌లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, విశిష్ట అతిథులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. వారికి భట్టి దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం నివాసంలో బోనాలకు, మహంకాళి అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండా సురేఖ, భట్టి సతీమణి నందిని, ఎమ్మెల్యే ఎన్‌.పద్మావతి తదితర మహిళా ప్రజా ప్రతినిధులు బోనం ఎత్తుకున్నారు. సీఎం, ఉప ముఖ్యమంత్రి మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఇంట్లో నుంచి బయటకు తెచ్చి జోగిని తలపైకెత్తారు. అక్కడి నుంచి ప్రజాభవన్‌ ఆవరణలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయం వరకు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్యన బోనాలను ఎత్తుకెళ్లారు. అనంతరం అమ్మవారికి భట్టి దంపతులు బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమర్పించారు. దేవాలయంలో ఉప ముఖ్యమంత్రితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి.. పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు వేద ఆశీర్వచనం చేశారు.

DEPUTY

SAKSHITHA NEWS