SAKSHITHA NEWS

mla కరీంనగర్ : ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాజపాలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ స్పష్టంచేశారు. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకునే అవకాశాలు లేవన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఎంపీ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ సర్కారు విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కరించే అవకాశాలున్నా రాజకీయ లబ్ధి కోసం సమస్యను సంక్లిష్టం చేసింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారు. విభజన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇప్పటికీ కేసీఆర్‌ ఈ భేటీని అడ్డం పెట్టుకొని మళ్లీ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఆ అవకాశం ఇవ్వద్దని ముఖ్యమంత్రులను కోరుతున్నా. వారు చర్చించుకున్న విషయాలు మా దృష్టికి కూడా రావాలి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం స్మార్ట్‌సిటీ మిషన్‌ గడువు పొడిగించింది. దీంతో కరీంనగర్‌ నగర పాలక సంస్థకు మరిన్ని నిధులు వచ్చే అవకాశముంది.
ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, భాజపాకు సంబంధంలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతిపరులను ఉపేక్షించదు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్, భారాస పార్టీలో మాదిరిగా రాజీనామా చేయకుండా భాజపాలోకి వచ్చే అవకాశంలేదు. రాజ్యసభ సభ్యుడు కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించడంలేదు. కాంగ్రెస్‌ పాలన బాగుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలి. ఒక వేళ ఉప ఎన్నికలు జరిగితే అన్ని స్థానాల్లో భాజపా గెలుస్తుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అంశాన్ని జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. కొత్త నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీలేదు’’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

mla

SAKSHITHA NEWS