SAKSHITHA NEWS

తిరుచానూరులో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం
సాక్షిత, తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు. అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు.
భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు  వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు తెలిపారు. 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది. ఈ సందర్భంగా టిటిడి జెఈవో వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ తర్వాత తొలిసారి శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని తిరుచానూరులో శాస్త్రోక్తంగా నిర్వహించామన్నారు. వ్రతంలో పాల్గొనేందుకు 550 టికెట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో 2, పుష్కరిణి వద్ద 1, గంగుండ్ర మండపం వద్ద 1 కలిపి 4 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ , జెఈవో వీరబ్రహ్మం దంపతులు, సివిఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈఓ లోకనాథం, విజివోలు మనోహర్, బాలిరెడ్డి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు శేషగిరి, శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దామోదరం ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS