SAKSHITHA NEWS

అమరావతి: దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు రాజ్‌కోట్‌ (గుజరాత్‌), బఠిండా (పంజాబ్‌), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్‌), కల్యాణి (పశ్చిమబెంగాల్‌) నగరాల్లో ఎయిమ్స్‌ ఆస్పత్రులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘‘స్వాతంత్ర్యం వచ్చాక 50ఏళ్ల వరకు దేశంలో ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేది. అది కూడా దిల్లీలోనే. ఏడు ఎయిమ్స్‌లకు మాత్రమే ఆమోదం లభించింది. కానీ అవీ పూర్తి కాలేదు. ఈరోజు ఏడు కొత్త ఎయిమ్స్‌లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి. గత ఆరేడు దశాబ్దాల్లో జరిగిన దానికంటే చాలా వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు.