SAKSHITHA NEWS

మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న తొలి శిక్షణ శిబిరం ఇదే కావడంతో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించకున్నది.

తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ తొలి శిక్షణ
దారి పొడవునా భారీగా స్వాగత తోరణాలు

మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న తొలి శిక్షణ శిబిరం ఇదే కావడంతో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించకున్నది. రెండురోజులపాటు జరిగే ఈ శిక్షణా శిబిరాలను బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంతి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్‌ వేదికను పరిశీలించిన నాందేడ్‌ ఎస్పీ శ్రీకృష్ణ కొకాటే నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నాందేడ్‌ విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్‌ ప్రయాణించే మార్గంలో ఆయన కాన్వాయ్‌లోనూ అనుమతి ఉన్న వాహనాలనే అనుమతిస్తామని తెలిపారు. అనుమతిలేని వాహనాలను అవసరమైతే సీజ్‌ చేస్తామని చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ ప్రయాణించే నాందేడ్‌ విమానాశ్రయం – అనంత్‌లాన్స్‌ మార్గంలో ట్రయల్న్‌ నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు ఉమ్మడి కార్యాచరణను రూపొందించారు. రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, పార్టీ సీనియర్‌ నేత రవీందర్‌సింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నాందేడ్‌లో స్వాగత తోరణాలు

నాందేడ్‌ వ్యాప్తంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌, దేశ్‌ కీ నేత కైసే హో కేసీఆర్‌ జైసే హో.. దేశ్‌ కీ నేత కేసీఆర్‌ వంటి నినాదాలతో ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌, మహారాష్ట్ర కిసాన్‌ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్‌ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితర ముఖ్య నేతల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలతో నాందేడ్‌ గులాబీమయమైంది. నాందేడ్‌ విమానాశ్రయం నుంచి అనంత్‌లాన్స్‌ మార్గంతోపాటు రైల్వేస్టేషన్‌ సహా ప్రధాన కూడళ్లలో గులాబీ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి.

సిద్ధమైన అనంత్‌లాన్స్‌

మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులను మాత్రమే శిక్షణా శిబిరాలకు ఆహ్వానించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు కన్వీనర్లు, సమన్వయకర్తలను పార్టీ నియమించింది. మహారాష్ట్రలోని ఆరు డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులతోపాటు ప్రతీ నియోజకవర్గం నుంచి కన్వీనర్‌, సమన్వయకర్త, మహిళా విభాగం కన్వీనర్‌, రైతు విభాగం కన్వీనర్‌, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు.

ప్రచార సామగ్రితోపాటు ల్యాప్‌ట్యాప్‌, ట్యాబ్‌

రెండు రోజుల శిక్షణ అనంతరం నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి (కరపత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్‌పోస్టర్లు)ని పార్టీ బాధ్యులకు అందజేయనున్నారు. వీటితోపాటు నెలరోజులపాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజకవర్గాలవారీగా పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కృతిక బాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేయనున్నారు.


SAKSHITHA NEWS