దేశ రాజధానిపై పగబట్టిన భానుడు..

దేశ రాజధానిపై పగబట్టిన భానుడు..

SAKSHITHA NEWS

Bhanu who is angry with the national capital..

ఢిల్లీలో రికార్డు ఉష్ణోగ్రత, 52.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్టోగ్రత..

న్యూఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర భారతంలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒకవైపు దక్షిణ భారతదేశంలో అక్కడక్కడా తొలకరి జల్లులు పలకరిస్తుంటే.. ఉత్తర భారత దేశంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది.

ఊహించని స్థాయిలో, అంచనాలకు మించి పెద్ద ఎత్తున ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. భానుడు ముఖ్యంగా ఢిల్లీ నగరంపై పగపడుతున్నాడు. ఎండల తీవ్రత కారణంగా ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో నీటిని వృథా చేసిన వాళ్లకు వేల రూపాయల్లో జరిమానా విధిస్తున్నారు.

ఎండల తీవ్రత పెరగడంతో ఢిల్లీలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. 8,302 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా అనేక నగరాల్లో పాఠశాలలను మూసివేయడానికి, వేసవి సెలవులు మరిన్ని రోజులు పొడగించాలని డిమాండ్ వినిపిస్తోంది.

ఆరుబయట పనిచేసే వ్యక్తులు సన్ స్ట్రోక్ కు గురవుతున్నారు. ఉత్తర భారతదేశం రాజస్థాన్‌లోని ఫలోడి పట్టణంలో 2016లో నమోదైన ఆల్-టైమ్ రికార్డ్‌ వేడి తీవ్రత కంటే కూడా ఈరోజు నమోదైన ఎండ తీవ్రత పెరిగింది.

గతంలో 51 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వేడిమి కారణంగా మూగ జీవాలు తలదాల్చుకునేందుకు చోటు లేక తల్లడిల్లుతున్నాయి. దాహం, తాపం తీర్చుకునేందుకు అవకాశం లేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి.


SAKSHITHA NEWS