జనగాం ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

Sakshitha news

జనగాం ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో

వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) సూచించారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనగాం ఎక్స్ రోడ్ వద్ద రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి వాహనదారుడు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలను వెంట ఉంచుకోవాలని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మైనర్లతో వాహనాలు నడిపించడం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ క్రమశిక్షణతో వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని ఎస్ఐ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ పోలీస్ సిబ్బంది, వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top