ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన
** ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన విద్యార్థులు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఎడిఫై స్కూల్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగే విధులు, ట్రాఫిక్ పోలీసుల పనితీరు, ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు ఎలా కమ్యూనికేట్ చేస్తారు, వాహనాల రిజిస్ట్రేషన్ విధానం, రోడ్డు భద్రతా నిబంధనలు వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు.
అలాగే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం గురించి వివరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత, జీబ్రా క్రాసింగ్ వినియోగం, రోడ్డు దాటే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పారు. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడం వల్ల జరిగే ప్రమాదాలు….రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ముఖ్యమైన అంశాలను ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ సంజీవ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై విలువైన సూచనలు ఇచ్చారు. చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
