రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలి

Sakshitha news

రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలి

** తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేత పూల చంద్రశేఖర్
…..

సాక్షిత ప్రతినిధి- గూడూరు/తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలకు, రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి, సీనియర్ నేత పూల చంద్రశేఖర్ విన్నవించారు.
బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గం ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తీవ్రమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు భద్రతా కారణాల దృష్ట్యా ఇంటి వద్దనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించడం జరిగినది.
రైతులు తమ పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలని, విద్యుత్ లైన్లు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సోమశిల డ్యాంతో పాటు చెరువులు వర్షపు నీటితో నిండి ఉన్నాయని, సోమశిల నుంచి పెన్నా నదికి భారీగా నీరు ఇప్పటికే విడుదల చేసిన నేపథ్యంలో, పెన్నా నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పూల చంద్రశేఖర్ కోరారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కోరారు.