పేద బాలికల ఉన్నత విద్యకు సువర్ణావకాశం…
కేజీబీవీల్లో ఇంటర్ తొలి సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం….
— జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరంలో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి అర్హత కలిగిన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన అర్హత గల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని పలు కేజీబీవీల్లో వివిధ కోర్సుల్లో ఖాళీ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ధర్మారం కేజీబీవీలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త కోర్సులో 25 సీట్లు, జూలపల్లిలో జీవశాస్త్ర విభాగంలో 12 సీట్లు, ముత్తారం (మంథని)లో వాణిజ్య విభాగంలో 10 సీట్లు, ఓదెలలో గణిత విభాగంలో 14 సీట్లు, జీవశాస్త్ర విభాగంలో 14 సీట్లు, పాలకుర్తిలో వైద్య ప్రయోగశాల సాంకేతిక కోర్సులో 5 సీట్లు, జీవశాస్త్ర విభాగంలో 10 సీట్లు, రామగిరిలో కంప్యూటర్ సైన్స్లో 15 సీట్లు, శ్రీరాంపూర్లో వాణిజ్య విభాగంలో 2 సీట్లు, బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త కోర్సులో 2 సీట్లు, సుల్తానాబాద్లో వాణిజ్య విభాగంలో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
కేజీబీవీల్లో చేరే విద్యార్థినులకు ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించబడతాయని తెలిపారు. పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు అందుబాటులో ఉన్నందున అర్హత కలిగిన విద్యార్థినులు ఆలస్యం చేయకుండా సంబంధిత కేజీబీవీ ప్రధానోపాధ్యాయులను సంప్రదించి ప్రవేశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
