SAKSHITHA NEWS

ఖచ్చితంగా అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు అందిస్తాం…
ఇండ్ల పట్టాల పంపిణీ ఘనత సీఎం కేసీఆర్‌దే…
సాక్క్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 1518 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ దుండిగల్ మండలాలకు చెందిన 1518 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని షాపూర్ నగర్ లోని ఎంజేఎస్ గార్డెన్ లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జి.ఓ నెం.58 కింద కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు వారికి పూర్తి హక్కు కల్పించేందుకు పెద్ద ఎత్తున పట్టాలు సిద్ధం చేసి మునుపెన్నడూ లేని విధంగా ఈ పథకం ద్వారా శాశ్వత ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జీఓ నెంబర్ 58 కింద పట్టాలు అందించేందుకు ముందుకువచ్చారని పేర్కొన్నారు.

అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని పలు మార్లు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా అర్హులైన వారందరికీ ఇండ్ల పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇంకా దరఖాస్తు చేసుకొని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మన పథకాలు దేశానికే ఆదర్శమని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS