Sri Ramoji Rao, the Chairman of the group of companies, passed away today
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు….దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ ది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి…ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము.
శ్రీరామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు… నన్ను ఆయనకు దగ్గర చేసింది. సమస్యలపై పోరాటంలో ఆయన నాకు ఒక స్ఫూర్తి. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో శ్రీరామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవి. శ్రీ రామోజీ అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
![ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం 2 WhatsApp Image 2024 06 08 at 13.51.46](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-13.51.46-683x1024.jpeg)