SAKSHITHA NEWS

వైజాగ్ రానున్న పెద్ద కంపెనీ

ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్న రహేజా గ్రూప్

విశాఖపట్నం :

ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త. విశాఖ అభివృద్ధికి దోహదపడేలా మరో ప్రతిష్టాత్మక కంపెనీ వైజాగ్ రానుంది. ఈ మేరకు రహేజ్ గ్రూప్ విశాఖపట్నంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే భూమిని కేటాయించింది. రుషికొండలోని ఐటీ సెజ్‌లో 7.24 ఎకరాల స్థలాన్ని రహేజా గ్రూప్‌నకు కేటాయించింది. ఈ స్థలాన్ని 33 ఏళ్లపాటు రహేజా గ్రూప్‌కు లీజుకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది నవంబర్ 14వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. రహేజా గ్రూప్ ఏర్పాటు చేసే ఐటీపార్కులో ఐటీ టవర్స్, ఇంక్యుబేషన్ స్పేస్, సపోర్ట్ సర్వీసులు, హెల్త్ క్లబ్, రెస్టారెంట్లు ఉండనున్నాయి.

వాస్తవానికి విశాఖలో ఐటీ సెజ్ ఏర్పాటుకు రహేజా గ్రూపు గతంలోనే ముందుకు వచ్చింది. ఇందుకోసం మధురవాడ ప్రాంతంలో స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. అయితే పార్కు ఏర్పాటు కాకపోవటంతో ఏపీఐఐసీ ఈ స్థలాన్ని వెనక్కిం తీసుకుంది. అయితే ఐటీ సెజ్ ఏర్పాటు కోసం రహేజా గ్రూప్ మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు తెలిసింది. దీంతో రుషికొండలో7.24 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసీ, రహేజా గ్రూపునకు కేటాయించింది. ఐటీ పార్క్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కలగడంతో పాటు పరోక్షంగా చాలా మందికి ఉపాధి దొరుకుతుందని అంటున్నారు.

మరోవైపు రహేజ్ గ్రూప్ ఇప్పటికే విశాఖలో ఇనార్బిట్ మాల్ నిర్మిస్తోంది. కైలాసపురం ప్రాంతంలో రూ.600 కోట్ల పెట్టుబడులతో ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టింది. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనుండగా.. దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్‌గా చెప్తున్నారు. ఇనార్బిట్ మాల్‌తో పాటుగా.. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ స్పేస్, కన్వెన్షన్‌ సెంటర్‌ను కూడా రహేజా గ్రూప్ నిర్మించనుంది.

ఇనార్బిట్ మాల్ నిర్మాణం ద్వారా సుమారు 8 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇనార్బిట్ మాల్ ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే ఐటీపార్క్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు రహేజా గ్రూపు ముందుకు రావడం విశేషం.


SAKSHITHA NEWS