ప్రశాంతంగా పండగలు నిర్వహించాలి…

Sakshitha news

ప్రశాంతంగా పండగలు నిర్వహించాలి…
భక్తిశ్రద్ధలతోఉత్సవాలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

సాక్షిత సూర్యాపేట జిల్లా/కోదాడ
పోలీసులతో సమన్వయం చేసుకోవాలి.ట్రాఫిక్‌, విద్యుత్‌, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
ఉత్సవ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కొదుమూరి ప్రవీణ్‌ ఎన్నిక పండగలు, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఉత్సవ కమిటీలు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు ప్రణాళికతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ స్పష్టం చేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధాన రహదారులు, ఉత్సవ ప్రదేశాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్‌ సరఫరా విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్‌ వైర్లు, లైటింగ్‌ ఏర్పాట్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు.అదేవిధంగా ఉత్సవ ప్రాంగణాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు, నిర్వాహకులకు సూచించారు. భారీగా ప్రజలు తరలివచ్చే ప్రాంతాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రవీణ్‌కు బాధ్యతలు
కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కొదుమూరి ప్రవీణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలను ప్రజలందరి సహకారంతో శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ సంతోష్‌కిరణ్‌, సీఐ శివశంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమాదేవి, విద్యుత్‌ ఏడీఈ ఎం.వెంకన్న, ఎస్‌ఎఫ్‌ఓ డాక్టర్‌ బాబు, ఏఈ రాజిరెడ్డి, వంగవీటి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు నూన సులోచన, కనకాల వెంకటనారాయణ, కౌన్సిలర్లు చలపాటి శివ, ఎర్నేని వెంకటరత్నం బాబు, షేక్‌ ఖాజా ఆజాదుద్దీన్‌, బొలిశెట్టి కృష్ణయ్య, ముస్లిం నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.