రామగుండం అభివృద్ధి పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి….
పెండింగ్ ప్రతిపాదనలకు సాంకేతిక, పరిపాలనా మంజూరులు ఇవ్వాలని ఇంజనీర్ ఇన్చీఫ్ను కోరిన మేయర్ మహంకాళి స్వామి….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, హైదరాబాద్/ : రామగుండం నగరంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు వెంటనే సాంకేతిక, పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు.
హైదరాబాద్లోని ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ప్రధాన కార్యాలయంలో ఆ విభాగం ఇంజనీర్ ఇన్చీఫ్ వై. సాయపరెడ్డిని మేయర్ స్వయంగా కలిసి రామగుండం నగర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. నగరంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి పథకం ద్వారా రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన పలు సవరించిన పనులకు సాంకేతిక అనుమతులతో పాటు పరిపాలనా మంజూరు ఇవ్వాలని కోరారు.
అలాగే జిల్లా ఖనిజాభివృద్ధి నిధుల ద్వారా రూ.6.85 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన నూతన జూనియర్ కళాశాల భవన నిర్మాణం, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ పథకం ద్వారా రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన శ్మశానవాటిక అభివృద్ధి పనులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రామగుండం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగంలో కొంతకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను కూడా వెంటనే భర్తీ చేసి, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగేందుకు సహకరించాలని మేయర్ కోరారు. దీనిపై ఇంజనీర్ ఇన్చీఫ్ సానుకూలంగా స్పందించినట్లు మేయర్ తెలిపారు.
కాంగ్రెస్ జిల్లా బలోపేతంపై రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చ
మేయర్ మహంకాళి స్వామి అంతకుముందు హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని పెంచి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ఠాకూర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్రెడ్డి, గంప వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
