కేజీబీవీ విద్యార్థులకు ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ చేయూత..

Sakshitha news

కేజీబీవీ విద్యార్థులకు ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ చేయూత…

రూ.10.5 లక్షల విలువైన పరుపులు, దుప్పట్లు, దిండు, బెడ్‌షీట్లు పంపిణీ….

సాక్షిత న్యూస్ పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, అంతర్‌గాం/సెప్టెంబర్ 05: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఎన్‌టీపీసీ రామగుండం సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా (సీఎస్‌ఆర్) సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

ఇందులో భాగంగా అంతర్‌గాం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థులకు సుమారు రూ.10.5 లక్షల విలువైన 360 పరుపులు, దిండ్లు, బెడ్‌షీట్లు, దుప్పట్లు శనివారం పంపిణీ చేశారు.

ఇప్పటికే ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో కేజీబీవీ పాఠశాలకు 360 బంకర్‌ బెడ్‌లు కూడా అందించారు. తాజాగా నిద్రకు అవసరమైన పరుపులు, దిండ్లు, బెడ్‌షీట్లు, దుప్పట్లు అందించడంతో విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించినట్లయింది.
విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి ఆరోగ్యం, సౌకర్యం, సురక్షితమైన వసతి కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా ఎన్‌టీపీసీ తన సామాజిక బాధ్యతను చాటుకుంటోందని నిర్వాహకులు తెలిపారు.

విద్యార్థుల అభ్యసనకు అనుకూలమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో ఎన్‌టీపీసీ డీజీఎం–హెచ్‌ఆర్‌ ప్రవీణ్‌ కె. చౌదరి, డీజీఎం–హెచ్‌ఆర్‌ రమ్య జయరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సీఎస్‌ఆర్‌ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.