రామగుండం నవ నిర్మాణానికి నాంది పలుకుతున్నాం

Sakshitha news

రామగుండం నవ నిర్మాణానికి నాంది పలుకుతున్నాం….

రేపటి భారీ అభివృద్ధి కార్యక్రమం, బహిరంగ సభను విజయవంతం చేయండి….

—ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : రామగుండం నియోజకవర్గంలో బుధవారం నిర్వహించనున్న భారీ అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభను విజయవంతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రామగుండంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సభకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

రామగుండం నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు హాజరుకానున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు, రేషన్ కార్డుల పంపిణీ చేపట్టడంతో పాటు 1,000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

గతంలో రామగుండాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రస్తుతం రామగుండం నవ నిర్మాణం కొనసాగుతోందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

రాజకీయాలకు అతీతంగా రామగుండం అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ బుధవారం జరిగే సభకు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు తమ మద్దతు తెలపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top