పొంగులేటి ఇంట ఆత్మీయ ‘మాధురి’యం..!
- స్వరాజ్యమ్మ… శ్యామలమ్మల పర్యవేక్షణలో పసందైన వంటకం!
పొలిటికల్ పవర్ ఖమ్మం: అధికార హోదా కన్నా ఆత్మీయతకే పెద్దపీట వేస్తోంది తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసం. సంక్రాంతి పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, తోటి మనుషుల నోరు తీపి చేయడమే అసలైన పండుగ అని చాటుతున్నారు ఆయన సతీమణి మాధురి. ప్రతీ ఏటా తమను నమ్ముకున్న వారికి రుచికరమైన పిండివంటలు అందించే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు.
- అమ్మ… అత్తమ్మల పర్యవేక్షణలో.. ఆప్యాయత వడ్డన
ఈసారి పిండివంటల తయారీలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. తన అత్తమ్మ స్వరాజ్యమ్మ… అమ్మ శ్యామలమ్మల పర్యవేక్షణలో ఈ వంటలను సిద్ధం చేయిస్తున్నారు. కుటుంబంలోని ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో… పాతకాలపు రుచులు ఉట్టిపడేలా వంటశాల సందడిగా మారింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి… మరీ ముఖ్యంగా ఇంట్లోని పెద్దల మార్గనిర్దేశంలో ఈ వంటకాలు చేయించడం విశేషం. - ఘుమఘుమలాడే పసందైన రుచులు
ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రస్తుతం ఓ పెద్ద వంటిల్లులా మారిపోయింది. నేతి అరిసెలు…. ఫ్లవర్ బాదుషాలు… మిక్చర్… నెలవంకలు వంటి నోరూరించే రుచులు అక్కడ సిద్ధమవుతున్నాయి. “మా కోసం నిరంతరం శ్రమించే సిబ్బంది కూడా మా కుటుంబ సభ్యులే” అని మాధురి పేర్కొన్నారు. బయట కొన్న స్వీట్ల కంటే తమ చేతులతో చేసి పెట్టే వంటకాల్లోనే నిజమైన ప్రేమ ఉంటుందని ఆమె నమ్మకం. - ఏడాది పొడవునా పంచే అనురాగం
పొంగులేటి కుటుంబానికి పదిమందితో ప్రేమను పంచుకోవడం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. వేసవిలో ఆవకాయ పచ్చడి… ప్రతీ సంక్రాంతి పండుగ వేళ పిండివంటలు పంపడం ఆ కుటుంబానికి ఒక ఆచారంగా మారిపోయింది. ఎన్ని పనులున్నా… తమను నమ్ముకున్న మనుషులను గౌరవించే ఈ సంస్కృతి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరి హృదయాలను హత్తుకుంటోంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
