రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Sakshitha news

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
భూ రీ-సర్వే ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి…

యెల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి…

–అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు…

సాక్షిత పెద్దపల్లి// అంతర్గాం, : జిల్లాలో ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు రెవెన్యూ కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. అలాగే భూ రీ-సర్వే కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు, యెల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న వరద పరిస్థితుల దృష్ట్యా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అంతర్గాం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ రెవెన్యూ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం శ్రీపాద యెల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించి నీటి నిల్వలు, వరద పరిస్థితులు, ఇన్‌ఫ్లో–అవుట్‌ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. భూ రీ-సర్వే కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మీసేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, కుటుంబ రిజిస్టర్ ధ్రువపత్రాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే జారీ చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కుటుంబ రిజిస్టర్ ధ్రువపత్రాలకు కీలక ప్రాధాన్యం ఉన్నందున, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ధ్రువపత్రాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం శ్రీపాద యెల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన అదనపు కలెక్టర్, జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు మరియు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహాల నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించాలని, నది పరివాహక ప్రాంతాల్లో చేపల వేటకు ఎవరూ వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రాజెక్టు నిర్వహణలో పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.

జూలై 31 మధ్యాహ్నం 3 గంటల నాటికి శ్రీపాద యెల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం 147.46 మీటర్లు ఉండగా, పూర్తి నీటి మట్టం 148.00 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం 18.6750 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, పూర్తి సామర్థ్యం 20.1754 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి 88,705 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 96,428 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ఇందులో 80,370 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా విడుదల చేస్తుండగా, మొత్తం 62 గేట్లలో 15 గేట్లు తెరిచి ఉంచినట్లు అధికారులు వివరించారు.
ఈ పర్యటనలో అంతర్గాం తహసీల్దార్, శ్రీపాద యెల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top