విద్య పేరుతో వ్యాపారం కాదు.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి, గోదావరిఖని, : గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని మార్కండేయ కాలనీలో ఉన్న కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టినట్లు ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆకర్షణీయమైన ప్రచారంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నప్పటికీ, పాఠశాలలో అవసరమైన విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు లేవని ఆరోపించారు. అర్హతలు లేని ఉపాధ్యాయులతో బోధన నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని అన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండాల్సి ఉన్నప్పటికీ, పాఠశాలలో తగిన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి విద్యార్థుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరమని విమర్శించారు.
విద్యార్థులకు వెంటనే తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంబంధిత విద్యాశాఖ అధికారులు పాఠశాలను తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి గుండ్ల లక్ష్మీప్రసన్న, గొడిసెల ప్రణీత్, తడిగొప్పుల అనూప్ సాయి, ఆరే జశ్వంత్, అభి, చైత్ర తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
