SAKSHITHA NEWS

పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచే లక్ష్యంగా పల్లెనిద్ర – జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్

ప్రజలు శాంతియుత జీవనం లో కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాలలో పల్లెనిద్ర చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఆర్ .గంగాధరరావు, ఐపిఎస్ అన్నారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేశ్వరం గ్రామంలో MPUP స్కూల్ నందు ఎస్పీ , పోలీసు అధికారులతో కలిసి పల్లెనిద్ర చేశారు.

జిల్లా ఎస్పీ స్వయంగా గ్రామాల్లో రాత్రి బస చేసి, స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వింటూ, వారితో పోలీస్ శాఖ యొక్క కార్యచరణలు, సమస్య వస్తే ఏ విధంగా సహాయం పొందాలి అనేది విపులంగా వివరించారు.

ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ.

▪️ప్రజలు గొడవలకు, ఘర్షణకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని, గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ, రాజకీయాలకు అతీతంగా ఉండి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.

▪️పల్లెనిద్ర ద్వారా ప్రజలకు పోలీసుల సేవలు మరింత దగ్గరయ్యేలా చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామన్నారు.

▪️పోలీసుల సేవలను అందుబాటులో ఉంచుతూ, గ్రామ స్థాయిలో నేరాలు, సమస్యాత్మక పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్చలు నిర్వహించారు.

▪️పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా సమస్యాత్మక గ్రామాల్లో నిఘాను మరింత పటిష్టం చేసి, శాంతి భద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.

▪️పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఉన్నారని, వారి సేవలను నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.

▪️జిల్లావ్యాప్తంగా నేర నివారణలో ప్రజలను భాగస్వాములుగా మార్చేందుకు “పల్లె నిద్ర” ఒక గొప్ప వేదికగా మారుతోంద ని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఉన్న బందర్ డి.ఎస్.పి సిహెచ్ రాజా ,పోలీస్ అధికారులు, గ్రామస్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి మండలానికి విస్తరించి, అన్ని గ్రామాల్లో పోలీసులు – ప్రజలు కలిసి నేర రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేద్దామని జిల్లా ఎస్పీ గారు పిలుపునిచ్చారు.

జిల్లా పోలీస్ శాఖ