వరద బాధితులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
వీర్లపల్లిలో కలెక్టర్తో కలిసి పరిస్థితుల పరిశీలన….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆర్ఎఫ్సీఎల్ (RFCL) ప్రహరీ గోడ కూలిపోవడంతో వరద నీరు వీర్లపల్లి గ్రామంలోని పలు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో కలిసి గ్రామంలో పర్యటించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇండ్లలోకి చేరిన వరద నీటితో ఏర్పడిన నష్టాన్ని పరిశీలించి, బాధితులకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, అవసరమైన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారి అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
