వసతి గృహాల్లో కనీస వసతులు తప్పనిసరి
సాక్షిత : వందశాతం ఉత్తీర్ణతకు యాక్షన్ ప్లాన్ తయారు చేయండి
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
పల్నాడు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో భోజనం, తాగు నీరు, వసతులు, ప్రథమ చికిత్స, పారిశుద్ధ్యం వంటి కనీస వసతుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంరంక్షణే ప్రప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లపై తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. డయేరియా, వివిధ రకాల జ్వరాలు నమోదైతే ఎలా స్పందించాలో తెలుపుతూ మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. కాచి వడగట్టిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రపరిచి ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు చేయించాలన్నారు. అన్ని వసతి గృహాల్లో మూడు రోజుల్లోగా తాగు నీటి పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలన్నారు. బయటినుంచి ఆహార పదార్థాలను నిషేధించాలన్నారు. వసతి గృహాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. వసతి గృహాల్లో పదవతరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. నిర్బంధ విద్యను అభ్యసించే హాస్టల్ విద్యార్థులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వకూడదన్నారు. వంద శాతం పాస్ పర్సెంటేజీ సాధించేందుకు రిసోర్స్ గ్రూపు ఏర్పాటు చేసి అత్యున్నత ఫలితాలు సాధించిన ఉపాధ్యాయుల మార్గాలు అందరు ఉపాధ్యాయులు ఫాలో అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, డీఎంహెచ్వో రవి, డీపీఓ నాగేశ్వర్ నాయక్, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
