గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Sakshitha news

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

జిల్లాలో గంజాయి విక్రయం, వినియోగంపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోతే మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఎలుగు మహేష్ వద్ద నుండి సుమారు అరకిలో గంజాయి కొనుగోలు చేసిన కేసారం గ్రామానికి చెందిన మెంతపోయిన గణేష్, అందులో కొంత వినియోగించి, కొంత అమ్మకానికి సిద్ధం చేశాడు. మిగిలిన సుమారు 50 గ్రాముల గంజాయిని ఐదు ప్యాకెట్లుగా తయారు చేసి సూర్యాపేటలో విక్రయించేందుకు తీసుకువస్తుండగా, మంగళవారం కేసారం గ్రామం బొడ్రాయి వద్ద ఉన్న ఆటో స్టాండ్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు.

సూర్యాపేట రూరల్ ఎస్సై ఎన్. బాలు నాయక్ నమ్మదగిన సమాచారంతో నిర్వహించిన దాడిలో నిందితుడు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని బుధవారం న్యాయస్థానంలో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు గంజాయి విక్రయం లేదా వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి సంబంధిత సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు.

Scroll to Top