మత్తు వదిలి మైదానానికి రండి – యువతకు ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పిలుపు..
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరడమే మనందరి లక్ష్యం….
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా బాలాజీ నగర్ జంక్షన్లో అవగాహన కల్పించిన ఎమ్మెల్యే నాగరాజు …
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్. నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ బాలాజీ నగర్ జంక్షన్ వద్ద మంగళవారం రోజున అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ జువాజీ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, హెల్మెట్ మరియు సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, అతివేగం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.
అదేవిధంగా యువత చెడు మార్గాలకు వెళ్లకుండా మంచి మార్గాల్లో నడుస్తూ, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలు, వ్యాయామం వంటి మంచి అలవాట్లను అలవరుచుకోవాలని, “మత్తు వదిలి మైదానానికి రండి” అంటూ యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వాహనదారులు, పోలీసు అధికారులు పాల్గొని రోడ్డు భద్రత నియమాలపై అవగాహన పొందారు…
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, డివిజన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
