ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
సాక్షిత : కోవూరులోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఏరియా హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. శాసనసభలో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రీ – కన్ స్ట్రక్షన్ చేసేందుకు 2 కోట్ల 85 లక్షలు మంజూరు చేయాలన్నారు. సంజీవిని పధకం ద్వారా రాష్టంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా వున్న సిబ్బంది కొరతను పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శిథిలావస్థకు చేరిన గైనకాలజీ వార్డు, పురుషులు మరియు మహిళల వార్డుల నిర్మాణానికి సంబంధించి 3 కోట్ల 24 లక్షలు నిధులు కేటాయించాలని కోరారు. కోవూరు, బుచ్చిరెడ్డి పాళెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డయాలసిస్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని,అలాగే కోవూరు ఆసుపత్రికి 2 కోట్ల 85 లక్షలు బుచ్చిరెడ్డి పాళెం ఆసుపత్రికి 3 కోట్ల 24 లక్షలు కొడవలూరు పి హెచ్ సిల రీ కన్సస్ట్రక్షన్స్ కోసం నిధులు మంజూరు చేయాలన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి పై వైద్యారోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసి పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.
