కాణిపాక వినాయకునికి టీటీడీ పట్టువస్త్రాలు

Sakshitha news

కాణిపాక వినాయకునికి టీటీడీ పట్టువస్త్రాలు

** టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుచే సమర్పణ

సాక్షిత ప్రతినిధి – కాణిపాకం / తిరుపతి: పూతలపట్టు నియోజకవర్గం కు చెందిన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల ను పురస్కరించుకుని టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈమేరకు టీటీడీ ఛైర్మెన్ బొల్లినేని రాజగోపాల్ (బీఆర్) నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం లో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం సంద‌ర్భంగా టీటీడీ త‌ర‌ఫున‌ పట్టువస్త్రాలు సమర్పించారు. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మెన్ కు ఆల‌య ఈవో పెంచల కిషోర్ కుమార్, ఏఈవో రవీంద్ర బాబు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. ద‌ర్శ‌నానంత‌రం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, బొక్కసం ఇంఛార్జి గురురాజ రావు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.