చిలకలూరిపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం
మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు
సాక్షిత చిలకలూరిపేట: పట్టణంలోని 12, 14, 15 వార్డులలో సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గత ఏడెనిమిది ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు సరైన రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు కేటాయించి, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
పట్టణ అభివృద్ధి కోసం మంత్రి నారాయణ సుమారు 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని, వీటితో పట్టణంలోని పలు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. కేవలం రోడ్లే కాకుండా, చిలకలూరిపేటలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన స్మశాన వాటికలు (కబరస్థాన్లు) శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికీకరించి, అన్ని కనీస సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరణించిన వారికి గౌరవప్రదమైన వీడ్కోలు పలికేలా అక్కడ వాతావరణం ఉండాలని, రాబోయే మూడు నాలుగు నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ , యువ నాయకుడు లోకేశ్ ల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోందని కొనియాడారు. భవిష్యత్తులో 25 లక్షల కోట్ల పెట్టుబడులు , తద్వారా 25 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సాంకేతిక మార్పుల వల్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వద్దని, అందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పుల్లారావు స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
