ఎస్టీయూ నాయకుల ఉద్యమ కరపత్రాలు ఆవిష్కరణ
సాక్షిత ప్రతినిధి – శ్రీకాళహస్తి / తిరుపతి:
పీ.ఆర్.సీ అమలు సహా ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ కరపత్రాలను స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) నాయకులు ఆవిష్కరించారు. ఈమేరకు శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన ఎస్టీయూ సమావేశంలో నాయకులు పావులూరు శ్రీనివాసులు, తిరుపతి జిల్లా అధ్యక్షులు వి.సుధాకర్ యాదవ్, ఇతర నాయకులు ఉద్యమ కార్యాచరణ గురించి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం స్టేట్ టీచర్స్ యూనియన్ – ఆంధ్రప్రదేశ్ చేపట్టనున్న దశలవారీ ఉద్యమ కార్యాచరణకు అందరూ కలసి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పే రివిజన్ కమిషన్ ను ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యం వల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అలాగే 125 రోజుల క్యాజువల్ లీవ్ అంశం, పెండింగ్, డిఎ బకాయిలు, పెన్షన్ సమస్యలు, ప్రమోషన్లు, బదిలీల జాప్యం, ఉపాధ్యాయులపై మోపుతున్న అనవసర పరిపాలనా పనులు వెంటనే తొలగించాలని యూనియన్ డిమాండ్ చేసింది.
పాంప్లెట్లో ఈ అన్ని డిమాండ్లతో పాటు ఉద్యమ కార్యాచరణ తేదీలు, ప్రదేశాలను ప్రకటించారు.
ఉద్యమ కార్యాచరణ తేదీలు, ప్రదేశాల మేరకు…
జనవరి 30న – తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన,
ఫిబ్రవరి 10న – జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా,
ఫిబ్రవరి 25న – విజయవాడలో రాష్ట్రస్థాయి ఉద్యమ కార్యక్రమం ఉంటుంది.
ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, ప్రకటించిన తేదీల ప్రకారం ఉద్యమాలను ఉధృతం చేస్తామని యూనియన్ హెచ్చరించింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
