నెలాఖరు వరకు పోలీస్ సెక్షన్ 30 యాక్ట్ అమలు
** కఠినంగా ఉండాలని అధికారులకు ఎస్పీ ఆదేశం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతి జిల్లా పరిధిలో నెల రోజుల పాటు అనగా ఈనెల 28వ తేదీ వరకు 30 పోలీస్ చట్టం అమలులో ఉంటుందని తిరుపతి ఎస్పీ
ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. ఈకారణంగా
జిల్లా పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు ఒకే సమయంలో లేదా ఒకే ప్రదేశంలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలు ఉంటాయన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఉత్తర్వు…
ఈ ఉత్తర్వుల ప్రకారం, 01-02-2026 నుంచి 28-02-2026 వరకు (ఒక నెల కాలవ్యవధి) తిరుపతి జిల్లా పరిధిలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించడంపై నియంత్రణలు అమల్లో ఉంటాయి. ప్రజా ప్రదేశాల్లో ఏదైనా సభ లేదా ఊరేగింపు నిర్వహించదలచిన పక్షంలో, ముందస్తుగా సంబంధిత అధికారుల నుండి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. దరఖాస్తులో సభ/ర్యాలీ నిర్వహించే ప్రదేశం, సమయం తదితర వివరాలు స్పష్టంగా పేర్కొనాలి. పరిస్థితులనుబట్టి మంజూరు చేసిన అనుమతిని ఎప్పుడైనా రద్దు చేసే హక్కు పోలీసు శాఖకు ఉంటుంది.
అయితే వివాహాలు, అంత్యక్రియలు వాటికి సంబంధించిన కార్యక్రమాలకు ఈ ఉత్తర్వులు వర్తించవు.
ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై పోలీస్ యాక్ట్ – 1861 ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు, సంఘాలు, సంస్థలు ఈ ఉత్తర్వులను గౌరవించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
