మున్సిపల్ కమిషనర్కు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వినతి పత్రం
సాక్షిత చిలకలూరిపేట: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిలకలూరిపేటలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబుకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1.25 లక్షల మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
వినతి పత్రంలో ఉద్యోగులు ప్రధానంగా ఆరు అంశాలను ప్రస్తావించారు. వాటిలో ముఖ్యమైనవి
- ఇంటింటి సర్వేల నుండి విముక్తి: తమ విద్యా అర్హతలకు అనుగుణంగా విధులు అప్పగించాలని, పదేపదే ఇంటింటికి తిరిగి చేసే సర్వేలు, ఇతర పనుల నుండి తమకు విముక్తి కల్పించాలని కోరారు. ఈ విధులు తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
- మాతృశాఖలకు బదిలీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వారి మాతృశాఖలకు బదిలీ చేయాలని కోరారు.
- సమయపాలన: కార్యాలయ పనివేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్లు, సెలవులు, పండుగలు, ఆదివారాల్లో బలవంతపు విధులు చేయిస్తున్నారని, ఈ ఒత్తిడి నుండి విముక్తి కల్పించాలని అభ్యర్థించారు.
- పదోన్నతులు, ఇంక్రిమెంట్లు: నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరేళ్ల పాటు ఒకే కేడర్లో పనిచేసిన వారికి AAS ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- కేడర్ మార్పు: ప్రస్తుతం ఉన్న రికార్డు అసిస్టెంట్ కేడర్ను జూనియర్ అసిస్టెంట్ కేడర్గా మార్చాలని కోరారు.
- పారదర్శక బదిలీలు: అన్ని విభాగాల వారీగా పదోన్నతి ఛానెల్స్ ఏర్పాటు చేసి, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలకు ప్రత్యేక విధివిధానాలను ఖరారు చేయాలని కోరారు.
తమ సమస్యలకు 15 రోజుల్లోగా పరిష్కారం చూపాలని ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ను అభ్యర్థించారు. లేనిపక్షంలో, ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
