తిరుమలకొచ్చే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి
** నూతన విధానం 15 నుంచే అమలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుమలకు వెళ్లే ముఖద్వారమైన అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు టీటీడీ భద్రతా వర్గాలు పేర్కొన్నారు. వివిధ వాహనాల్లో తిరుమల చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఈనెల 15వ తారీఖు నుంచే వాహనాలకు ఫాస్ట్ టాగ్ విధానం తప్పనిసరి చేయడం జరిగిందని తెలిపారు. దీంతో ఇకపై ఫాస్ట్ టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించ డం జరగదన్నారు. ఫాస్ట్ టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్ట్ టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. అలా ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని తెలిపారు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించాలని కోరారు.
