ప్రతీ ఊర్లో గుడి, బడి ఆవశ్యం
** కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: భారతదేశ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడంలో భాగంగా ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఊర్లో గుడి, బడి నిత్యం ఆవశ్యమని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి వెల్లడించారు. స్థానిక సూరపరాజుపల్లిలో శ్రీ రామాలయ మహా కుంభాభిషేక కార్యక్రమంలో ఆయన పాల్గొని స్థానిక భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషన చేశారు. రామాలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులను ఆశీర్వదించారు. విజయేంద్ర సరస్వతి స్వామి వాళ్ళ బృందానికి ఆలయ ధర్మకర్త సురపురాజు శివరామరాజు, కేటీ రామరాజులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శివరామరాజు గృహంలో స్థానిక భక్తులతో స్వామీజీ పేరుపేరునా పలకరించి ముచ్చటించారు. అనంతరం భక్తులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఊర్లో ఆలయాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని, ఆలయ నిర్వహణకు ఎవరూ లేరనే భావన వదిలేయాలని… అది భగవంతుడే చూసుకుంటాడని తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహించి వారికి ఆదాయ మార్గాలను చూపించి, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేటి తరుణంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కర్మాగారాలను ఏర్పాటు చేయాలన్నారు. బాల్య దశలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించే దిశగా పెద్దలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వగ్రామంలో ఆలయ నిర్మాణానికి సిద్ధపడిన శివరామరాజును అభినందించారు. ఇలాంటి ఆలయాల ప్రారంభోత్స వాలకు టీటీడీ లాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రగతి పథంలో నడుస్తున్న పీఠాలు ముందుకు రావాలన్నారు. ఈ మహా కుంభాభిషేక కార్యక్రమంలో సురపరాజ శివరామరాజు, కొండూరు తులసీరామరాజు, కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్రాజు సుకుమార్ రాజు, శివరాజు, చెంగల్ రాజు( బిజెపి), మాధవ రాజు, వ్యూహ లక్ష్మీదేవి, ఆలయ ధర్మకర్త మాసి కృష్ణమూర్తి, నారాయణ, బాబు రాజు, నాగేశ్వరరాజు, సుసివ్, సుజాత, సుషిత, సుబ్బరాజు, విజయమ్మ, సునీల్, అనిల్, శిరీష, మయూరి, స్థానిక గ్రామస్తులు, విశేష సంఖ్యలో శ్రీరామ భక్తులు పాల్గొన్నారు.
