SAKSHITHA NEWS

జిల్లాలో సామూహిక ఎలుకల నిర్మూలన
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి


సాక్షిత రాజమహేంద్రవరం :
కలెక్టర్ ఛాంబర్ లో సాంఘిక ఎలుక నివారణ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలోని 18 మండలాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎలుకల నివారణ కోసం మందులు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,82,103 ఎకరాల్లో ఆగష్టు 25 నుంచి ఆగష్టు 31 వరకు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్నీ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్క ఎకర సాగు భూమి , సాగేతర భూమి విస్తీర్ణం లో ఎలుకలు నిర్మూలన మందు క్రోమోడియోలిన్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది సూచనలు సలహాలు మేరకు రైతులంతా అన్ని ప్రాంతాల్లో ఒకేసారి సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.


జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు మాత్కడుతూ, రైతులకు క్రోమోడియోలిన్‌ మందును ఉచితంగా పంపిణీ చేసేందుకు జిల్లాకు ఎలుకల నివారణా మందు 737 కిలోల మందును ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. సాగు, యాంత్రిక , జీవ , రసాయనిక పద్ధతులను ఉపయోగించి ఎలుకల నివారణ చర్యలు తీసుకోవడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ, వ్యవసాయేతర ఖాళీ భూములు తదితర చోట్ల ఎలుకల నివారణ కోసం మందును వినియోగించనున్నట్లు చెప్పారు. ఎలుకలు వల్ల వరి పిలకలు దశలో 40 నుంచి 60 శాతం మేర నష్టం కలుగుతుందని, ఆ నష్టం పూత దశలో అయితే 5 నుంచి పది శాతం మే ఉంటుందన్నారు. ఎలుకలు చాలా తెలివైన జీవి అని విత్తనాలను, నారు మొక్కలను, ఆకులను, కాండాలను, పూతను నాశనం చేస్తాయన్నారు. వీటి నివారణకు సంబంధించి పొగపెట్టె విధానం, ఎలుకల సహజ శత్రువులను పెంపొందించే విధానం ఎర పద్ధతి లేదా రసాయన మందులు వినియోగం ద్వారా వీటిని నివారించవచ్చన్నారు.

క్రోమోడియోలిన్‌ మందులను వినియోగించి ఎలుకలు కలుగులో పెట్టడం ద్వారా ఎలుకలను నివారించవచ్చన్నారు. 96 శాతం నూకలు, 2 శాతం నూనె, 2 శాతం క్రోమోడియోలిన్‌ మందును కలిపి విషపు ఎరను తయారు చేసి పెట్టుకోవాలన్నారు. ఆగష్టు 25 నుంచి ఆగష్టు 31 వరకు ఏడు రోజుల పాటు జరిగే సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు వ్యవసాయ సిబ్బంది పాల్గొంటారని ఆయన చెప్పారు. రైతులు సహకరించాలని కోరారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మాధవ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS