ఆషాఢ వేడుకలతో సంస్కృతికి పట్టం….
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంతో స్నేహబంధాలకు నూతన సందేశం…
–మాజీ కార్పొరేటర్ కౌశిక లత…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, : రామగుండం నియోజకవర్గంలోని గంగానగర్ పవర్ హౌస్ కాలనీలో సరిత, శారద, సుశీల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ కౌశిక లత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కౌశిక లత మాట్లాడుతూ, ఇలాంటి సంప్రదాయ వేడుకలు నిర్వహించడం ద్వారా మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు భావితరాలకు చేరుతాయని అన్నారు. మహిళల్లో ఉత్సాహం, ఆనందం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే గోరింటాకు వేడుకలు ప్రతి కాలనీలో, ప్రతి ఇంట నిర్వహించాలని ఆకాంక్షించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ ఆమె ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం అదే వేదికపై అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక లత మాట్లాడుతూ, “స్నేహానికి కులం, మతం, ధనిక–పేద అనే భేదాలు ఉండవు. ప్రేమ, నమ్మకం, ఆప్యాయతతో ఏర్పడే స్నేహబంధం కుటుంబ సభ్యుల మధ్య కూడా చిరకాలం కొనసాగుతుంది” అని పేర్కొన్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ మహిళల ఐక్యతను చాటిచెప్పే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మల్లిక, శారద, ఎన్టీపీసీ ఉద్యోగులు, కాలనీ వాసులు, మహిళామణులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


