“ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయండి….

Sakshitha news

“ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయండి….

–ఎస్ ఐ ఆర్ ఇంచార్జ్‌లకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దిశానిర్దేశం….

గోదావరిఖని, భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ( ఎస్ ఐ ఆర్ )ను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులకు, ఇంచార్జ్‌లకు సూచించారు.
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఇంటికి చేరుకుని అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు, ఇంచార్జ్‌లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన పత్రాల సేకరణలో పూర్తి సహకారం అందించాలని తెలిపారు.
ప్రతి డివిజన్, గ్రామంలో రోజువారీ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

ఈ సందర్భంగా డివిజన్, గ్రామాల ఇంచార్జ్‌లు తమ పరిధిలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమం పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు,ఎస్ ఐ ఆర్ ఇంచార్జ్‌లు పాల్గొన్నారు.

Scroll to Top