ఓటు హక్కు పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి….
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.
భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమంలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్లో నిర్వహించిన ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బి ఎల్ ఓ లు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే, కార్యక్రమం పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎంతో ముఖ్యమని అన్నారు. బీఎల్ఓలు ఇంటింటికి వచ్చినప్పుడు ప్రజలు అవసరమైన పత్రాలు, వివరాలు అందించి బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, బూత్ లెవల్ అధికారులు (బి ఎల్ ఓ లు), కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
