అధికారుల నిరాహార దీక్షకు ఏఐటీయూసీ సంఘీభావం…
పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యం, ప్రభుత్వానికి డిమాండ్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:గోదావరిఖని, సింగరేణి ఆర్జీ-1 కార్యాలయం ఎదుట అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను దీక్షలో పాల్గొంటున్న అధికారులకు మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింగరేణి అధికారుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. అధికారులకు సంబంధించిన పీఆర్పీ, పే స్కేలు వంటి కీలక అంశాలు మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండడం బాధాకరమని పేర్కొన్నారు.
అధికారుల న్యాయమైన డిమాండ్లను ఇకపై నిర్లక్ష్యం చేయకుండా యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం అధికారులు చేస్తున్న ఉద్యమానికి ఏఐటీయూసీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆఫీస్ బేరర్స్, పిట్ కార్యదర్శులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

