అధిష్టానాల నిర్ణయం మేరకే “స్థానికం” లో పోటీలు
** జనసేన రాష్ట్రనేత బాలినేని శ్రీనివాస రెడ్డి
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల పిఓసిలు, ముఖ్యనాయకులతో
ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు, డిలిమిటేషన్ కమిటీ సభ్యులైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, అహుడా ఛైర్మన్ టిసి వరుణ్ లు శనివారం ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మున్సిపల్ కార్పోరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయితీల్లో జరుగుతున్న వార్డులు, డివిజన్ల డిలిమిటేషన్ పై చర్చించారు. జనసేన బలంగా ఉండే వార్డులు, డివిజన్లు గుర్తించాలని వాటిలో ఎమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటి వివరాలను కమిటికి అందించాలని మాజీ మంత్రి బాలినేని తెలిపారు. డిలిమిటేషన్ పై పూర్తి వివరాలను ఆయా ప్రాంత నాయకులు 13వ తేది లోపు కమిటీకి పంపాలని ఆయన కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ప్రకటన వెలువడిన నాడే జనసేన పోటీ చేసే స్థానాలను ప్రకటించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నివేదిక సమర్ఫణకు ఇచ్చిన సమయం తక్కువుగా ఉందని పొడిగింపు విషయం జనసేన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ దృష్ఠికి తీసుకెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాలపైన మాత్రమే కసరత్తు చేస్తున్నామని త్వరలో నియోజకవర్గాల వారీగా మండలాల్లో పర్యటించి ఎంపిటీసి, జెడ్పిటీసి స్థానాల్లో జనసేన ఎక్కడ బలంగా ఉంది, ఎవరు పోటీ చేయాలనే అంశాలతో నివేదిక సిద్ధం చేసి అధిష్టానానికి అందిస్తామని బాలినేని చెప్పారు.
ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ ఏఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజేపి రాష్ట్ర అధ్యక్షుల భేటిలో తేలుతుందని ఆయన తెలిపారు. కాగా ఆదివారం (నేడు) అనంతపురంలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రాయలసీమలో జనసేన పార్టీని బలోపేతం చేయడం తమ లక్ష్యమని ఆయన తెలిపారు. జనసేన పార్టీలో గ్రూపులు వీడి అందరూ ఐక్యంగా ఉంటేనే కూటమి ఎమ్మెల్యేలు పార్టీ నాయకులకు విలువ ఇస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కడప జిల్లా కో ఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్, రాందాస్ చౌదరి, తిరుపతి టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, సుమన్ బాబు, లక్ష్మీపతి, జంగం తులసిరామ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
