టీటీడీ ఈడబ్ల్యూఏ నాయకుల పట్టు వస్త్రాలు సమర్పణ
….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్థానిక తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈడబ్ల్యూఏ)
ఆధ్వర్యంలో శనివారం భక్తిశ్రద్ధలతో, మేళతాళాల మధ్య అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇందులో పలువురు టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక కోలాహలంతో పాల్గొని తుడా ఆఫీస్ నుంచి తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయం వరకు ఘనంగా పాదయాత్ర నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన చీర్ల కిరణ్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉద్యోగుల తరపున గంగమ్మ తల్లికి సారె సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. తిరుపతి సంస్కృతి, ఆధ్యాత్మిక చరిత్రలో గంగమ్మ జాతరకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రజలను రక్షించేందుకు జగన్మాత గంగమ్మ అవతరించిందనే విశ్వాసం భక్తుల్లో బలంగా ఉందన్నారు.
పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పాలించే కాలంలో మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడిన పాలెగాడిని సంహరించి స్త్రీజాతిని రక్షించేందుకు గంగమ్మ తల్లి అవతరించిందని భక్తులు నమ్ముతారని తెలిపారు. పాలెగాడి అహంకారాన్ని చెరిపివేసేందుకు గంగమ్మ తల్లి అనేక వేషధారణలు చేసి, చివరకు నాలుగో రోజు దొర వేషంతో దర్శనమిచ్చి అతన్ని సంహరించిందని పురాణగాథను వివరించారు.
అటువంటి పవిత్రమైన జాతరలో దొర వేషంతో పాలేగాడిని సంహరించిన నాలుగో రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చీర్ల కిరణ్ పేర్కొన్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు, టీటీడీ – ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా మిత్రులు, పోలీస్ సిబ్బంది సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు, అలాగే గంగమ్మ తల్లి మహాప్రసాదం (అక్షింతలు, గాజులు, పసుపు దారం, పసుపు, కుంకుమ)ను ఉద్యోగులందరికి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చీర్ల కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వంకీపురం పవన్, అసోసియేట్ ప్రెసిడెంట్ మణికంఠ, కోశాధికారి గుంటూరు రేఖ, వర్కింగ్ ప్రెసిడెంట్ గంట భరత్, వైస్ ప్రెసిడెంట్ కొప్పర్తి శివ, టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు రమాదేవి, సారిక, మదన్ మోహన్, చిన్నంగారి సూరిబాబు, ఆంజనేయులు, అశోకన్, విశ్వనాధం, మదన్, వెంకటనాగులు, రమణ, శ్రీనివాస మూర్తి, చంద్ర కిరణ్, వాసన్, శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, ఉమాశంకర్, సురేష్, ఈశ్వర్ నాయక్, గుణ, తేజేశ్వర్ రెడ్డి, టి.భరత్, టీటీడీ ట్రాన్స్పోర్ట్, టీటీడీ ప్రెస్, క్యాంటీన్, హెల్త్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
