దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమాల ఫలితమే ఈ పరిణామమని వ్యాఖ్య….
విద్యార్థుల హక్కులను కాపాడాలని కేంద్రానికి అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గొడిశల నరేష్ విజ్ఞప్తి….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత, విద్యార్థులు సాధించిన విజయమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జీడీకే-11 ఇంక్లైన్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గొడిశల నరేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ, గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని అన్నారు.
ఇది కేవలం ఒక కేంద్ర మంత్రి రాజీనామా మాత్రమే కాదని, తమ హక్కుల కోసం దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు ఐక్యంగా సాగించిన పోరాటానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు. యువత సంకల్పం ముందు ఎంతటి ప్రభుత్వమైనా తలవంచాల్సి వస్తుందని ఈ పరిణామం మరోసారి నిరూపించిందని అన్నారు.
విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం, వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడడం ఏ ప్రభుత్వానికీ తగదని పేర్కొన్న ఆయన, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
భవిష్యత్తులో కూడా విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే ఏఐటీయూసీ యువత, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉద్యమించిన విద్యార్థులు, యువతకు గొడిశల నరేష్ అభినందనలు తెలిపారు.

