జానపద కళల జాతరకు తరలిరండి – గోదావరిఖనిలో సాంస్కృతిక వేడుకలు…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : ప్రపంచ జానపద కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 22న గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణమండపం ప్రాంగణంలో ఘనంగా జానపద కళోత్సవాలు నిర్వహించనున్నట్లు కృషి కళా సంస్థ అధ్యక్షులు కాసిపాక రాజమౌళి తెలిపారు.
సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించే పాటలు, నృత్యాలు, వాద్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇప్పటికే పేర్లను నమోదు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కళాకారులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా పాల్గొనే అవకాశం కల్పించడం విశేషమని తెలిపారు.
కళల పరిరక్షణ, జానపద సంప్రదాయాల ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న కళాకారులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేయనున్నట్లు వెల్లడించారు.
ఈ జానపద కళల జాతరను విజయవంతం చేయాలని, కళాకారులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృషి కళా సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
వివరాలకు సహాయ కార్యదర్శి బీరుక లక్ష్మణ్ను 9848268908 నంబర్లో సంప్రదించవచ్చు. కార్యక్రమంలో సంస్థ కళాకారులు బోడకుంట వెంకటరాజం, సిరిపురం శ్రీనివాస్, అట్ల జగ్గయ్య, కాంపెల్లి నరసింగరావు, బీరుక లక్ష్మణ్, జనగామ శ్రీనివాస్, పండుగ రాజేశ్వరరావు, కనకం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
