ఎండ తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో వచ్చే నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత పెరిగే అవకాశముందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు మరియు చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని సూచించారు.
ఈ సమయంలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు టోపీ, రుమాలు లేదా గొడుగు ఉపయోగించాలని తెలిపారు. వడదెబ్బ నుంచి రక్షణ కోసం ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. దాహం లేకపోయినా తరచూ నీరు తాగడం, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు నివారించవచ్చని తెలిపారు. అదేవిధంగా, వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని, 6281492368 నంబర్కు సంప్రదించాలని అధికారులు తెలిపారు.

