చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి
వినాయక విగ్రహాలు ఏర్పాటుకు ఆన్లైన్ లో అనుమతి తప్పనిసరి
పబ్లిక్ ప్రదేశాలలో మండపాలు,పందిళ్ల
అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
సాక్షిత న్యూస్ చిలకలూరిపేట
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పట్టణ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి పబ్లిక్ ప్రదేశాలలో మండపాలు,పందిళ్లు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించుకునే వారు సులభంగా అనుమతులు పొందేందుకు “సింగిల్ విండో” విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు https://ganeshutsav.net
అనే వెబ్సైట్ను పోలీస్ శాఖ ప్రారంభించిందని పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఈ వెబ్సైట్ ద్వారా “సింగిల్ విండో” విధానంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు పొందేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. దరఖాస్తుదారుడు పోలీస్ స్టేషన్లు లేదా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత పోలీస్ అధికారి స్వయంగా పందిరి/మండప స్థలాన్ని తనిఖీ చేస్తారన్నారు. నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని ఎన్ ఓ సి జారీ చేస్తారని ఎస్పీ తెలిపారు.
“సింగిల్ విండో” విధానం ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందే విధానాన్ని వివరిస్తూ పల్నాడు జిల్లా ఎస్పీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకోను విధానము:
https://ganeshutsav.net అనే వెబ్సైట్ ను ఓపెన్ చేసి దరఖాస్తు దారుడు అతడి ఫోన్ నెంబర్ నమోదు చెయ్యాలి.నిర్ధారణ కోసం దరఖాస్తు దారుడు ఫోన్ నెంబర్ కు ఓ.టి.పి వస్తుంది, దానిని ఎంటర్ చెయ్యాలి. వెంటనే దరఖాస్తు పత్రం వస్తుంది.
దరఖాస్తు పత్రంలో దరఖాస్తు దారుని పూర్తి పేరు, చిరునామా, ఆర్గనైజేషన్ పేరు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, అది ఏ పోలీస్ స్టేషన్/సర్కిల్/సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం/పందిరి ఎత్తు, కమిటీ సభ్యులు పేర్లు వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్టించే రోజు, నిమజ్జనం చేసే తేదీ సమయం, ప్రదేశం, నిమజ్జన ఊరేగింపు ఏ వాహనంలో నిర్వహిస్తారు తదితర వివరాలను పొందుపరిచి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కు వెళ్తుంది. సంబంధిత పోలీస్ అధికారి పందిరి/మండప స్థలాన్ని తనిఖీ చేస్తారు.
నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని ఎన్ ఓ సి జారీ చేస్తారు.
నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మండపంలో ఉంచాలి. పోలీస్ వారు సందర్శన సమయంలో QR కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, భద్రతా పరమైన నియమ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని, పబ్లిక్ ప్రదేశాలలో అనుమతి లేకుండా వినాయక మండపాలు/పందిళ్లు ఏర్పాటు చేయవద్దని, సింగిల్ విండో విధానం ద్వారా సులభంగా అనుమతులు పొందాలని చిలకలూరిపేట పట్టణ సిఐ రమేష్, చిలకలూరిపేట రూరల్ సిఐ బి సుబ్బనాయుడు ప్రజలకు తెలిపారు.
