రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు: ఎమ్మెల్యే జారె
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
మనిషి ప్రాణాలను కాపాడే గొప్ప సేవ రక్తదానం అనే భావంతో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకులు మహిళలు ప్రజా ప్రతినిధులు రక్తం దానం చేసి రక్తదానం మహాదానం అని నిరూపించారు.
ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన రక్తాన్ని ఆసుపత్రి రక్తనిధిలో భద్రపరిచి అత్యవసర సమయాల్లో పేదలు ప్రమాదంలో గాయపడిన వారు ప్రసవ సమయంలో అవసరం ఉన్న తల్లులకు ఉచితంగా అందించనున్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమని ఒక్క బాటిల్ రక్తం ముగ్గురికి ప్రాణం పోస్తుందన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడూ సంవత్సరానికి కనీసం ఒకసారి రక్తదానం చేస్తే ఎవరూ రక్తం కోసం ఇబ్బందులు పడరని చెప్పారు. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలలో ముందుకు రావాలని అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో నూతన డిజిటల్ ఎక్ష్ రే యూనిట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వైద్య సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
