తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ఆచార్య జయశంకర్.. ఆశయాలను కొనసాగించాలి….
–మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కొనియాడారు.
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణ శ్రీతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, చైతన్యం ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన మన మధ్య లేకపోవడం రాష్ట్రానికి తీరని లోటని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే నిజమైన నివాళి అని అన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేష్, శంకర్ నాయక్, ధూళికట్ట సతీష్, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


