విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు….

Sakshitha news

విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు….

ఆడపిల్లల భద్రతకు షీ టీమ్ అండగా ఉంటుంది…

గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించిన పెద్దపల్లి షీ టీమ్….

సాక్షిత పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి//
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో సుందిళ్ల గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహిళలు, బాలికల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, టీనేజ్ వయసులో ఎదురయ్యే శారీరక, మానసిక మార్పులు, తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన విధానం, పోక్సో చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థులు పాటించాల్సిన ప్రవర్తనా నియమాలు, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరించారు.

మహిళలు, బాలికల భద్రత కోసం ప్రతిరోజూ బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్ద ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా మహిళలు లేదా విద్యార్థినులు వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

మహిళలకు ప్రమాదం లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 100/112కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930కు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కోసం టీ-సేఫ్ యాప్ (T-Safe App)ను వినియోగించాలని తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి సమస్య ఎదురైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని, సమస్యను దాచిపెట్టకుండా ధైర్యంగా ముందుకు రావాలని షీ టీమ్ సభ్యులు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదానందం, ఇన్‌చార్జి సునంద, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.